Pages

Subscribe

ప్రథమ స్కంధము 185 - 202

* * *
కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట
* * *
క. 185
పురుషుం డాఢ్యుఁడు ప్రకృతికిఁ, బరుఁ డవ్యయుఁ డఖిల భూత బహిరంత ర్భా
సురుఁడు నవలోకనీయుఁడు, పరమెశ్వరుఁడైన నీకు బ్రణుతులగు హరీ!

వ. 186
మఱియు జవనిక మఱవున నాట్యంబు సలుపు నటుని చందంబున, మాయాజవని
కాంతరాళంబున నిలువంబడి, మహిమచేఁ బరమహంసలుఁ, నివృత్తరాగద్వేషులు,
నిర్మలాత్ములునైన ముబులకు నదృశ్యమానుండవై, పరిచ్ఛినుండవు గాని నీవు
మూఢదృక్కులు, గుటుంబవతులు నగు మాకు నెట్లు దర్శనీయుండవయ్యెదు?
శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద! పంకజనాభ!
పద్మమాలికాలంకృత! పద్మలోచన! పద్మసంకాశచరణ! హృశీకేశ!
భక్తియోగంబునం జేసి నమస్కరించెద నవధరింపుము.

సీ.
తనయుల తోడనే దహ్యమానంబగు, జతుగృహంబందును జావకుండఁ
గురురాజు వెట్టించు ఘోరవిషంబుల మారుతపుత్రుండు మడియకుండ
ధార్తరాష్ట్రుఁడు సముద్ధతిఁ జీర లొలువంగ ద్రౌపదిమానంబు దలఁగకుండ
గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డ లనిలోన నలఁగకుండ

తే. 187
విరటుపుత్రిక కడుపులో వెలయు చూలు, ద్రోణనందన శరవహ్నిఁ ద్రుంగకుండ
మఱియు రక్షించితివి పెక్కుమార్గములను, నిన్నునేమని వర్ణింతు నీరజాక్ష! 

మత్తకోకిల. 188
బల్లిదుండగు కంసుచేతను బాధ నొందుచునున్న మీ
తల్లిఁ గాచిన భంగిఁ గాచితి ధార్తరాష్ట్రులచేత నేఁ
దల్లడంబునఁ జిక్కకుండఁగ దావకీన గుణవ్రజం
బెల్ల సంస్తుతి సేసి చెప్పఁగ నెంతదాన జగత్పతీ!

క. 189
జననము నైశ్వర్యంబును, ధనమును విద్యయును గల మదచ్ఛన్ను లకిం
చన గోచరుఁడగు నిన్నున్, వినుతింపఁగ లేరు నిఖిల విభుధస్తుత్యా!

వ. 190
మఱియు భక్తధనుండును, నివృత్త ధర్మార్ధ కామ విషయుండును,
ఆత్మారాముండును, రాగాది రహితుండును, కైవల్యదాన సమర్ధుండును,
కాలరూపకుండును, నియామకుండును, నాద్యంత శూన్యుండును,
విభుండును, సర్వసముండును, సకల భూత నిగ్రహానుగ్రహకరుండునైన
నిన్నుఁ దలంచి నమస్కరించెద నవధరింపుము.మనుష్యుల విడంబించు
భవదీయ విలసనంబు నిర్ణయింప నెవ్వఁడు సమర్థుండు? నీకు బ్రియాప్రియులు
లేరు; జన్మ కర్మ శూన్యుండవైన నీవు తిర్య గాది జీవులయందు వరాహాది
రూపంబులను జలచరంబులయందు మత్స్యాదిరూపంబులను, నవతరించుట
లోకవిడంబనార్థంబు గాని, జన్మ కర్మ సహితుండ వగుటం గాదు.

ఉ. 191
కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో
గోపిక ద్రాటఁ గట్టిన వికుంచిత సాంజన బాష్ప తోయధా
రా పరిపూర్ణ వక్త్రము గరంబులఁ బ్రాముచు వెచ్చ నూర్చుచుం
బాపఁడవై నటించుట గృపాపర! నా మదిఁ జోద్యమయ్యెడిన్.

క. 192
మలయమునఁ జందనము క్రియ, వెలయఁగ ధర్మజునికీర్తి వెలయించుటకై
యిలపై నభవుఁడు హరియదు, కులమున నుదయించె నండ్రు గొంద ఱనంతా!

క. 193
వసుదేవ దేవకులు దా, పసగతి గతభవమునందుఁ బ్రార్థించిన సం
తసమునఁ బుత్రత నొందితి, వసురుల మృతికంచుఁ గొంద ఱండ్రు మహాత్మా!

క. 194
జలరాశిలో మునింగెడి, కలముక్రియన్ భూరిభార కర్శిత యగు నీ
యిలఁ గావ నజుఁడు గోరినఁ గలిగితి వని కొంద ఱండ్రు గణనాతీతా!

తే. 195
మఱచి యజ్ఞాన కామ కర్మముటఁ దిరుగు, వేదనాతురులకుఁ దన్నివృత్తిఁ జేయ
శ్రవణచింతన వందనార్చనములిచ్చు, కొఱకు నుదయించి తండ్రు నిన్ గొందఱభవ!

మ. 196
నినుఁ జింతింపుచుఁ బాడుచుం బొగుడుచు న్నీ దివ్య చారిత్రముల్
వినుచుం జూతురుగాక లోక లితరాన్వేషంబులం జూతురే?
ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంభై మహాయోగి వా
గ్వినుతంబైన భవ త్పదాబ్జ యుగమున్ విశ్వేశ! విశ్వంభరా!

వ. 197
దేవా! నిరాశ్రయులమై భవదీయ చరణారవిందముల నాశ్రయించి
నీ వారలమైన మమ్ము విడిచి విచ్చేయనేల? నీ సకరుణావలోకసంబుల
నిత్యంబును జూడవేని యాదవ సహితులైన పాండవుల జీవునిం
బాసిన యింద్రియంబుల చందంబునఁ గీర్తిసంపదలు లేక తుచ్ఛత్వంబు
నొందుదురు. కల్యాణలక్షణ లక్షితంబులైన నీ యడుగులచేత నంకితంబైన
యీ ధరణీమండలంబు నీవు వాసిన శోభితంబు గాదు. నీ కృపా
వీక్షణామృతంబున నిక్కడి జనపదంబుల గుసుమ ఫలబరితంబులు,
నోషధి తరు లతా గుల్మ నద నదీ నగ సాగర సమేతంబులునై యుండు.

ఉ. 198
యాదవులందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి
చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజ చింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియు నట్లుగఁ జేయఁగదయ్య! యీశ్వరా!

శా. 199
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!
లోకద్రోహి నరేంద్రవంశ దహనా! లోకేశ్వరా! దేవతా
నీక బ్రాహ్మణ గోగణార్తి హరణా! నిర్వాణ సంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానెధీ!

వ. 200
అని యిట్లు సకల సంభాషణంబుల నుతియించు గొంతి మాటలకు
నియ్యకొని గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషంబున
మోహంబు నొందించి, రథారూఢుండై కరినగరంబునకు వచ్చి, కుంతీ
సుభద్రాదులన్ వీడ్కొని, తన పురంబునకు విచ్చేయ గమకించి, ధర్మరాజుచేఁ
గించిత్కాలంబు నిలువుమని ప్రార్థితుండై నిలిచె. అంత బంధువధ
శోకాతురుండైన ధర్మజుఁడు నారాయణ వ్యాస ధౌమ్యాదులచేతఁ
దెలుపంబడియుఁ దెలియక మోహితుండై నిర్వివేకంబున నిట్లనియె.

మ. 201
తన దేహంబునకై యనేక మృగసంతానంబుఁ జంపించు దు
ర్జను భంగిన్ గురు బాలక ద్విజ తనూజ భ్రాతృసంఘంబు ని
ట్లనిఁ జంపించిన పాపకర్మనకు రాజ్యాకాంక్షికిన్ నాకు హా
యన లక్ష్యావధినైన ఘోర నరక వ్యాసంగము ల్మానునే?

వ. 202
మఱియుఁ బ్రజా పరిపాలన పరుండైన రాజు ధర్మయుధ్ధంబున
శత్రువుల వధియించినఁ బాపంబు లేదని శాస్త్రవచనంబు గలదు.
అయిన నది విజ్ఞానంబు కొఱకు సమర్ధంబు గాదు. చతురంగంబుల
ననే కొక్షౌహిణీ సంఖ్యాతంబులం జంపించితి. హతబంధులైన
సతుల కేను జేసిన ద్రోహంబు దప్పించుకొన నేర్పు లేదు.
గృహస్థాశ్రమ ధర్మంబులైన తురంగమేధాది యాగంబులచేతం
బురుషుండు బ్రహ్మహత్యాది పాపంబులవలన విడివడి
నిర్మలలుండగునని నిగమంబులు నిగమించు. పంకంబునఁ
బంకిలస్థలఁబునకును, మద్యంబున మద్య భాండమునకును
శుధ్ధి సంభవింపని చందంబున, బుధ్ధిపూర్వక జీవహింసనంబు
లైన యాగంబుల చేతం బురుషులకుఁ బాపబాహుళ్యంబ
కాని పాపనిర్ముక్తి గాదని శంకించెద.

0 comments: