Pages

Subscribe

ప్రథమ స్కంధము 232 - 240


శ్రీ కృష్ణుఁడు ద్వారకానగరమున కరుగుట

వ. 232
అంతఁ గృష్ణుండు చుట్టాలకు శోకంబు లేకుండం జేయుకొఱకును, సుభద్రకుం బ్రియము సేయుకొఱకును, గజపురంబునం గొన్ని నెలలుండి, ద్వారకానగరంబునకుం బ్రయాణంబు సేయందలంచి, ధర్మనందనునకుం గృతాభివందనుండగుచు నతనిచేనాలింగితుండై యామంత్రణంబు వడసి, కొందఱు దనకుం నమస్కరించినం గౌఁగిలించికొని, కొందఱు దనుం గౌఁగిలింప నానందించుచు రథారోహణంబు సేయు నవసరంబున, సుభద్రయు ద్రౌపదియుఁ గుంతియు నుత్తరయు గాంధారియు ధృతరాష్టృండును విదురుండును యుధిష్ఠిరుండును యుయుత్సుండును గృపాచార్యుండును నకుల సహదేవులను వృకోదరుండును ధౌమ్యుండును (సత్సంగంబువలన ముక్త దుస్సంగుండగు బుధుండు సకృత్కాల సంకీర్త్యమానంబై రుచికరంబగు నెవ్వని యశంబు నాకర్ణించి విడువనోపఁడట్టి) హరితోడి వియోగంబు నహింపక, దర్శన స్పర్శనాలాప శయనాసన భోజనంబుల వలన నిమిషమాత్రంబున హరికి నెడలేనివారలైన పాండవులం, గూడికొని, హరి మరలవలెనని కోరుచు హరి చనిన మార్గంబు చూచుచు, హరి విన్యస్తచిత్తులై లోచనంబుల బాష్పంబు లొలుక నంతనంత నిలువంబడిరి. అయ్యవసరంబున

సీ.
కనకసౌధములపైఁ గౌరవకాంతలు గుసుమవర్షంబులు గోరి కురియ
మౌక్తికదామ సమంచిత ధవళాత పత్రంబు విజయుండు పట్టుచుండ
నుద్ధవ సాత్యకు లుత్సాహవంతులై రత్నభూషిత చామరములు వీవ
గగనాంతరాళంబు గప్పి కాహళభేరి పణవవశంఖాది శబ్దములు మొరయు    

ఆ. 233
సకల విప్రజనులు సగుణనిర్గుణరూప, భద్రభాషణములు పలుకుచుండ
భువన మోహనుండు పుండరీకాక్షుండు, పుణ్యరాశి హస్తిపురము వెడలె.

వ. 234    
తత్సమయంబునం బొరసుందరులు ప్రాసాద శిఖరభాగంబుల నిలిచి, గోపాల
సుందరుని సందర్శించి, మార్గముల రెండుదెసలఁ గరారవిందంబులు సాచి
యొండొరులకుం జూపుచుం దమలోనం, దొల్లిటం బ్రళయంబున గుణంబులం
గూడక జీవులు లీనరూపంబులై యుండం బ్రపంచంబు ప్రవర్తింపని సమయంబునఁ
బ్రపంచాత్మకుండు నద్వితీయుండు నగుచు మేలై దీపించు పురాణపురుషుండీతం
 డనువారును, జీవులకు బ్రహ్మత్వంబు గలుగ లయంబు సిద్ధుంచుట 
యెట్లనువారును, గ్రమ్మఱ న ప్పరమేశ్వరుండు నిజ వీర్య ప్రేరితయై
నిజాంశభూతంబులైన జీవులకు మోహినియైన సృష్టి సేయ నిశ్చయించి,
నామరూపంబులు లేని జీవులందు నామరూపంబులు గల్పించు కొఱకు
వేదంబుల నిర్మించి మాయానుసరణంబు సేయు ననువారును, నిర్మల
భక్తి సముత్కంఠా విశేషంబుల నకుంఠితులై జితేంద్రియులగు విద్వాంతు రనువారును,
యోగమార్గంబులం గాని దర్శింపరా దనువారునై మఱియు.

మ.235
రమణీ! దూరమువోయెఁ గృష్టురథమున్ రాదింక వీక్షింప నీ
కమలాక్షుం బొడగానలేని దినముల్ గల్పంబులై తోచుఁ గె
హములం దుండఁగనేల పోయి పరిచర్యల్ సేయుచున్ నెమ్మి నుం
దము రమ్మా! యనె నొక్క చంద్రముఖి గందర్పాశుగభ్రాంతయై

మ.236
తరుణీ! యాదవరాజు గాఁడితఁడు వేదవ్యక్తుఁడై యొక్కఁడే
వరుస లోకభవ స్థితి ప్రళయముల్ వర్తింపఁగాఁజేయ దు
స్తర లీలరతుఁడైన యీశుఁ డితనిన్ దర్శించితిం బుణ్యభా
సుర నేనంచు నటించె నొక్కతె మహా శుద్ధాంతరంగంబున

క.237
తామసగుణములగు రాజులు, భూమిం బ్రభవించి ప్రజలఁ బొలియింపఁగ స
త్వామలతనుఁడై యీతఁడు, భామిని! వారల వధించుఁ బ్రతికల్పమున 

సీ
ఈ యుత్తమశ్లోకుఁ డెలిమి జన్మించిన యాదవ కులమెల్ల ననఘ మయ్యె
నీ పుణ్యవర్తనుఁడె పొద్దు నుండిన మథురాపురము దొడ్డ మహిమ గనియె
నీ పూరుషశ్రేష్ఠ నీక్షించి భక్తితో ద్వారకావాసుల ధన్యులైరి
యీ మహాబలశాలి యెఱిఁగి శాసింపఁగ నిష్కంటకం బయ్యె నిఖిలభువన

తే.
మీ జగన్మోహనాకృతి నిచ్చగించి, పంచశర భల్లజాల విభజ్యమాన
వివశ మానసమై వల్లవీసమూహ, మితని యధరామృతము గ్రోలు నెల్ల ప్రొద్దు.

ఉ. 239
ఈ కమలాక్షు నీ సుభగు నీ కరుణాంబుధిఁ బ్రాణనాథుఁగాఁ
జేకొని వేడ్కొఁ గాఁపురము సేయుచునుండెడి రుక్మిణీముఖా
నేక పతివ్రతల్ నియతి నిర్మలమానసలై జగన్నుతా
స్తోక్త విశేష తీర్థములఁ దొల్లిటిబాముల నేమి నోఁచిరో

వ. 240
అని యిట్లు నానావిధంబులైన పురసుందరీ వచనంబు లాకర్ణించి కటాక్షించి నగుచు
నగరంబు వెడలె. ధర్మజుండును హరికి రక్షకంబులై కొలిచి నడువం జతురంగంబులు
బంపినఁ దత్సేనాసమేతులై తన తోడి వియోగంబునకు నోర్వక దూరంబు వెనుతగిలిన
కౌరవుల మరలించి, కురు జాంగల పాంచాల శూరసేన యామున భూములం గడిచి,
బ్రహ్మవర్త కురుక్షేత్ర మత్స్య సారస్వత మరుధన్వ సౌవీ రాభీర విషయంబు
లతిక్రమించి, తత్త ద్దేశనివాసు లిచ్చిన కానుకలు గొనుచు నానర్త మండలంబు
సొచ్చి పద్మబంధుండు పశ్చిమసింధు నిమగ్నుండైన సమయంబున
బరిశ్రాంతవాహుండై చని చని.  

1 comments:

Rajasekharuni Vijay Sharma said...

మురళీ కృష్ణ గారు మీరు చాలా శ్రమ కోర్చి రాస్తున్న ఈ బ్లాగు రేపటి తరలాకు చాలా ఉపయోగ పడుతుంది. చాలా మంచి పని చేస్తున్నారు. ఈశ్వరానుగ్రహము మీయందు చాలా ఉన్నతముగా ఉన్నది. ధన్యవాదములు.